ఆదోని, అక్టోబర్ 5: రాస్తారోకోలు, ఆందోళనలు, రాళ్లదాడితో కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఆదివారం అట్టుడికింది. సోమవారం నాటి పండుగ సందర్భంగా ఓవర్గం వారు తరలిస్తున్న గోవులను భజరంగ్దళ్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసుల సాయంతో గోశాలకు తరలించడం ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో ఆ వర్గంవారు పట్టణంలోని విహెచ్పి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతిగా విహెచ్పి, భజరంగ్దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరిపై ఓ వర్గం వారు రాళ్లురువ్వడంతో ప్రతిగా వీర రాళ్లు విసిరారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం జరిగే పండుగ సందర్భంగా వధించేందుకు తీసుకువెళ్తున్న గోవులను స్థానిక భజరంగ్దళ్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసుల సాయంతో గోశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఆ వర్గం వారు ఊరేగింపుగా టూటౌన్ పోలీసుస్టేషన్కు చేరుకుని ఆందోళనకు దిగారు. మాంసం కోసం తెచ్చిన ఆవులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. డిఎస్పీతో మైనారిటీ నాయకులు వాగ్వివాదానికి దిగారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ శివరామిరెడ్డి హామీ ఇవ్వడంతో శాతించిన వారు నినాదాలు చేస్తూ ఊరేగింపుగా కదిలారు. ఇంతలో విశ్వహిందూపరిషత్ కార్యాలయం రావడంతో దానిపైకి రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న మరో దుకాణం అద్దాలు సైతం పగిలాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అక్కడినుంచి తరిమివేశారు. విహెచ్పి కార్యాలయంపై దాడికి నిరసనగా భజరంగ్దళ్, విహెచ్పి కార్యకర్తలు సాయంత్రం కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్తుండగా మరోవర్గం వారు ఓ ప్రార్థనాలయం నుంచి రాళ్లురువ్వారు. దీంతో కొద్దిసేపు ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి లాఠీచార్జి జరిపి ఇరువర్గాలను తరిమికొట్టారు.


No comments:
Post a Comment