న్యూఢిల్లీ, మార్చి 3: ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశంతో సహా అనేక జిల్లాలలో క్రైస్తవ మిషనరీలు విచ్చలవిడిగా పాల్పడుతున్న మత మార్పిడులను అడ్డుకునేందుకు గట్టి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు
జి రాఘవరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని తాలూకాల్లో పూర్తిసమయం పని చేసే ఒక కార్యకర్తను నియమించి క్రైస్తవ మిషనరీలు పాల్పడుతున్న మత మార్పిడులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తామని ఆయన శనివారం విలేఖరులకు చెప్పారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన శనివారం మొట్టమొదటిసారిగా పరిషత్ అగ్రనాయకులు అశోక్ సింఘాల్, హరి విష్ణు దాల్మియా తదితరులతో కలసి హోలీని పురస్కరించుకుని మీడియాతో మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటితో పోల్చిచూస్తే ఇప్పుడు రాష్ట్రంలో మత మార్పిడులు తగ్గాయని ఆయన చెప్పారు. ఇకనుంచి ప్రతి ఆదివారం క్రైస్తవ మిషనరీలకు పోటీగా హిందువులలో మత మార్పిడికి వ్యతిరేకంగా అవగాహన పెంచటానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల పేదరికాన్ని ఆసరాగా తీసుకుని మిషనరీలు మత మార్పిడి చేస్తున్నాయని చెప్పారు. క్రైస్తవ మిషనరీలకు అందుతున్నట్లు నిధులు విశ్వహిందూ పరిషత్కు అందిననాడు మత మార్పిడులకు తెర పడుతుందని అన్నారు. మన దేశంలోని పీఠాధిపతులు, మఠాధిపతులు తమ సొంత ఆశ్రమాలు, పీఠాల అభివృద్ధిపైనే దృష్టిని కేంద్రీకరించటంతో హిందువులను సమైక్యపరచి ఏకతాటిపై నడిపించలేకపోతున్నామని ఆయన అభిప్రాయ పడ్డారు. ఐదు దశాబ్దాలలో విశ్వహిందూ పరిషత్ హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిర్విరామ కృషి చేసిందని చెప్పారు. విశ్వహిందూ పరిషత్ మరింత బలపడగలదన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
గోమాంసం ఎగుమతి చేస్తే తీవ్ర పరిణామాలు
పనె్నండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో గోమాంసాన్ని పెద్దఎత్తున ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాలన్న ప్రణాళికా సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల హిందువులు భక్తితో పూజించే ఆవులు అధిక సంఖ్యలో బలైపోతాయని పరిషత్ సంరక్షణ సభ్యుడు అశోక్ సింఘాల్ విలేఖరులకు చెప్పారు. వాజపేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గోసంరక్షణకు అధికప్రాధాన్యం ఇవ్వగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గోమాంసాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని అనుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. హిందువులను నెమ్మది నెమ్మదిగా మైనారిటీలుగా మార్చి ముస్లింలు, క్రైస్తవులకు అధికప్రాధాన్యం లభించే విధంగా సోనియాగాంధీ పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియలో భాగంగానే మత కలహాల నిరోధక బిల్లుకు రూపకల్పన చేశారని అన్నారు. సోనియాగాంధీ నాయకత్వం వహిస్తున్న జాతీయ సలహా మండలి ఈ బిల్లును రూపొందించిందని ఆయన గుర్తు చేశారు. భారత దేశంలో హిందువులను దశల వారీగా మైనారిటీలుగా మార్చడానికి కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. రామమందిరం నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఆయన అంగీకరించారు. హిందువులు తమ ఆరాధ్యదైవంగా పూజించే రామునికి దివ్య మందిరాన్ని తాము నిర్మించి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు